బన్నీ-లోకేశ్ మూవీపై కీలక అప్‌డేట్.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్

  • అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ కాంబోలో రానున్న AA23 ఆగిపోలేదని వివరణ 
  • సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వదంతులకు చెక్ పెట్టిన రచయిత రత్నకుమార్
  • ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నానంటూ తన పోస్ట్‌లో వెల్లడి
  • షెడ్యూల్ సమస్యల కారణంగా ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ఇటీవల ప్రచారం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న పాన్-ఇండియా చిత్రం (AA23) ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని రచయిత రత్నకుమార్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం కొనసాగుతోందని, దానిపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆయన తేల్చిచెప్పారు.

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'విక్రమ్' సినిమా విడుదలై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ 3న రత్నకుమార్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగమైనందుకు గర్వంగా ఉందని తెలుపుతూ, పోస్ట్ చివర్లో "#AA23 కోసం వేచి ఉండలేను" అని రాసుకొచ్చారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ పై వస్తున్న పుకార్లకు ఆయన ఒక్క పోస్ట్‌తో చెక్ పెట్టారు.

2026 ప్రారంభంలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ సంగీతంతో వచ్చిన టీజర్ భారీ అంచనాలు క్రియేట్ చేసింది. అయితే, షెడ్యూల్ సమస్యలు లేదా క్రియేటివ్ విభేదాల కారణంగా ఈ సినిమాను పక్కన పెట్టారని ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని నిరాధారమైన వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' వంటి చిత్రాలకు సహ రచయితగా పనిచేసిన రత్నకుమార్, ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని గతంలోనే తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఉండే ఈ కథాంశంపై అల్లు అర్జున్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని పేర్కొన్నారు. తాజా స్పష్టతతో ఈ వదంతులు పూర్తిగా నిరాధారమైనవని ట్రేడ్ వర్గాలు కూడా అంటున్నాయి. 2027లో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు మళ్లీ పెరిగాయి. ఈ వార్తతో అల్లు అర్జున్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Rathna Kumar
AA23
Allu Arjun-Lokesh Kanagaraj Project

More Telugu News